Saturday, August 30, 2014

సకల విఘ్నాలను హరించే మా ఇంట్లో వినాయక చవితి పూజ 

పం డుగల్లో ముఖ్యమైంది వినాయక చవితి పండుగ. ఈ పండుగ రోజున గణపతిని పరమ భక్తితో పూజిస్తారు. సృష్టికర్త విధాత దగ్గర నుంచి సామాన్య మానవుని వరకు అందరూ సకల విఘ్నాలను హరించే విఘ్నాధిపతైన గణేశుని పూజిస్తారు. ఏ శుభకార్యమైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు వినాయక పూజతో ప్రారంభమవుతాయి. ప్రతి పనిలో ప్రారంభంలో


 
పూజలు పొందేది ఈ దేవుడే. వినాయకుని భక్తితో 21 పత్రులతోను, 21 రకాల పిండి వంటలతో పూజించిన తర్వాత ఆ రోజు సాయింత్రం,లేదా మూడు రోజులు,ఏడు,తొమ్మిది రోజులు ఇలా వాల్ల ఓపికను బట్టి దగ్గర్లో ఉన్న  భావి, చెరువు, లేక నది నీళ్ళలో నిమజ్జనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
వినాయకుడిని ఏకదంతుడు,గజరూపుడు, మూషిక వాహనుడు, లంబోదరుడు అనేక పేర్లతో పిలుస్తారు. గణేశ తత్వంలో ఎన్నో విశేషాలున్నాయి. పార్వతీ దేవి మంగళ శుభప్రదమైన పసుపు ముద్దతో గణపతిని తయారు చేసింది. 
గణపతి జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదిస్తారని ప్రతీతి. విశ్వామిత్రముని దమయంతీ భర్త నలుడుకి వినాయక వ్రతం గురించి తెలిపారు. కృష్ణుడు ఈ వ్రతమాచరించి జాంబవంతుడి నుంచి శమంతక మణితోపాటు జాంబవతిని భార్యగా పొందాడు. వృత్తాసురుని వధించేటప్పుడు ఇంద్రుడు, రావణుడు కొనిపోయిన సీతను వెతికేటప్పుడు రాముడు, ఆకాశం నుంచి గంగను తెచ్చేటప్పుడు భగీరధుడు వినాయక వ్రతం ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 
సృష్టిలో మొదటి శబ్ధమైన ఓం కారమైన ప్రణవనాదంతో ఆయన రూపం పోలిక కలిగి ఉందని వేదాలు, ఉపనిషత్తులు ఈ అభిప్రాయం గురించి ప్రస్తావించాయి. ఏనుగు సూక్ష్మ బుద్దికి ప్రతీక. అందుచేత జ్ఞాన ప్రదాతైన గణేశుని ఏనుగు తలతో పూజిండం అతని నాలుగు చేతులు మానవులకు సహాయం చేయడంలో గొప్పశక్తిని సూచిస్తాయి. 
విద్యారంభానికి సైతం గణేశుడే దైవతం. బాధ్రపద శుద్ద చవితినాడు గణేశుని పూజిం చడంలో అనేక ప్రత్యేకతలున్నాయి. గణేశుడు సృష్టికి శ్రీకారం, ఓంకారం. సృష్టి ఓంకార రూపంలోఆవిర్భవించింది. ఓంకార స్వరూపుడుగా గణపతిని ప్రస్తుతిస్తూ వేదాల్లో “”గణానంత్వ గణపతిగం హావామహే’అని స్తుతించబడింది. గణపతి పూజవల్ల జ్ఞానం, బుద్ధి, ఐశ్వర్యం లభిస్తాయనేది ప్రతీతి.

Monday, August 11, 2014

కేరళ బ్యాక్ వాటర్స్ హౌస్ బోటు ల అద్భుత జర్నీ...!!!

 కేరళ రాష్ట్రం పేరు వినగానే మొదటగా మీకు గుర్తుకు వచ్చేవి బ్యాక్ వాటర్స్ మరియు హౌస్ బోటులు. కేరళ రాష్ట్ర టూరిజం లో మూడు వంతుల మంది పర్యాటకులు హౌస్ బోటులు ప్రయాణాలకే మొగ్గుచోపుతారు,ప్రత్యేకంగా బ్యాక్ వాటర్స్ కొరకే వెళతారు. దేశంలోని పర్యాటకులే కాక, ఇతర దేశాలనుండి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆనందించి వెళతారు. ఈ రకంగా కేరళ దేశీయులకు, విదేశీయులకు ఒక సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. కేరళలో ఈ కెనాల్స్ ఎన్నో కిలోమీటర్లు ప్రయాణిస్తూ ట్రావెల్లెర్ లకు గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ అందాలు చూపుతున్నాయి. ఇంతవరకూ కేరళలోని బ్యాక్ వాటర్స్, హౌస్ బోటు లు చూడని వారి కోసం ఈ  కథనం తో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మంచి మార్గదర్శకత కాగలదని వివరిస్తున్నాం. 
హౌస్ బోటు ... అధ్బుత ఆనందాలు మనల్ని మైమరిపిస్తాయి...అల్లెప్పి బ్యాక్ వాటర్ టూర్స్ కు ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలలో అల్లెప్పి ఒకటి. ఇక్కడ మీరు ఒక రోజు బోటు విహారం లేదా ఓవర్ నైట్ స్టే కొరకు ఒక పేకేజ్ తీసుకోవచ్చు. బ్యాక్ వాటర్ టూర్స్ చాలావరకు అల్లెప్పి నుండి మొదలవుతాయి.
తాజా అనుభూతుల అల్లెప్పి ఇక్కడ గల హౌస్ బోటు లలో కొద్ది గంటలు గడిపితే చాలు ఎంతో రిఫ్రెష్ అయిపోతారు. చల్లటి నీటి గాలులలో ప్రకృతి అందాల మధ్య అద్భుత ఆనందాలు అనుభవించగలరు.
ప్రయాణం ఇక్కడి బోటు ప్రయాణాలు పున్నమడ లేక్ నుండి మొదలవుతాయి. ఇక్కడే ప్రసిద్ధ నెహ్రు ట్రోఫీ స్నేక్ బోటు రేస్ కూడా జరుగుతుంది. అల్లెప్పి నుండి చాలా ఇతర రూట్ లు కూడా కలవు.
అల్లెప్పి నుండి అల్లెప్పి ఈ విహారాలలో అధికంగా అల్లెప్పి నుండి అల్లెప్పి వరకు పేకేజ్ లు వుంటాయి. దీనిలో హౌస్ బోటు లో ఓవర్ నైట్ స్టే కూడా వుంటుంది. బోటు పున్నమడ లేక్ నుండి దాటి రాత్రి అంతా వత్తకాయాల్ లేక్ వద్ద వుండి మరుసటి రోజు ఉదయానికి వెనక్కు తిరిగి అల్లెప్పి చేరుతుంది.
అల్లెప్పి నుండి కుమరకోమ్ అల్లెప్పి బ్యాక్ వాటర్స్ నుండి, మరొక అందమైన ప్రదేశం కుమరకోమ్ వరకు ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ లో ప్రయాణం ఆహ్లాదం కలిగిస్తుంది. చక్కని ప్రకృతి, వీనుల విందైన గాలుల సంగీతం కల ఈ విహారం మీకు లైఫ్ లో ఒకేసారి కలిగే అనుభూతిగా వుంటుంది.
పక్షుల కిల కిల ధ్వనులు మీకు పక్షుల పట్ల ఆసక్తి కలిగి వుంటే, మీరు తప్పక అల్లెప్పి నుండి కుమరకోమ్ కు బ్యాక్ వాటర్స్ లో ప్రయానిన్చాల్సిందే. మీ జర్నీ అంతా దోవలో ఎన్నో రకాల, స్థానిక మరియు వలస పక్షులు కనపడతాయి.
అల్లెప్పి నుండి కొట్టాయం బ్యాక్ వాటర్ విహారంలో మీరు అల్లెప్పి నుండి కొట్టాయం కూడా ప్రయాణించ వచ్చు. ఈ రూట్ లో మీరు తాటి చెట్లు, వాటి పై నుండి కల్లు తీసి జీవనం సాగించే వారిని చూస్తారు.
అల్లెప్పి నుండి తొత్తప్పల్లీ బహుశా తొత్తప్పల్లీ గురించి మీరు ఎక్కువగా విని వుండరు. ఇది ఒక ప్రత్యేక ప్రదేశం. ఇక్కడ గల వరి పొలాలు, కొబ్బరి తోటలతో తొత్తప్పల్లీ ఒక స్వర్గం లా వుంటుంది. మీ బోటు విహారం లోని  ఈ రూట్ లో మీరు ఇతర ఆకర్షణలు అయిన అమ్బలపుజ్జ టెంపుల్ , చంపక్కులం చర్చి, వెంబనాడ్ లేక్ మరియు పతిరమనల్ వంటివి చూడవచ్చు.
అల్లెప్పి నుండి మంకొట్ట ఈ జర్నీ మరో మారు మిమ్మల్ని పున్నమడ లేక్ నుండి తీసుకు వెళుతుంది. మంకొట్ట ఒక చిన్న గ్రామం. ఇక్కడి ప్రజలు పీచు తయారీ పరిశ్రమలతో జీవనం సాగిస్తారు.
అల్లెప్పి నుండి అలుమ్కదావు అలుమ్కదావు లో బోటు తయారీ పరిశ్రమ కలదు. ఇక్కడ మీరు తిరిగే హౌస్ బోటు లు అలుమ్కడవు లో తయారు అవుతాయి. ఈ ప్రదేశం పర్యటన ఒక గొప్ప అనుభూతి కాగలదు. బోటు ల తయారీ, అక్కడి ప్రజల జీవన విధానం అద్భుతంగా వుంటాయి.
అసలు సిసలైన కేరళ భోజనం కేరళ భోజనం ఎంతో రుచికరంగా వుంటుంది. సాధారణంగా అనేక మార్లు ఈ హౌస్ బోటు లకు వచ్చేవారు, కేరళ వంటకాలు అమితంగా ఇష్టపడే వారే. హౌస్ బోటు లోనే ఈ వంటకాలను వంటవారు తయారు చేస్తారు. మీరు ముందుగా వారికి ఏ డిష్ కావాలో, ఎలా కావాలో చెపితే, మీ ఛాయస్ మేరకు వారు దానిని తయారు చేస్తారు.
కేరళ ప్రజల ఆతిధ్యం కేరళ లో హౌస్ బోటు టూర్లను నిర్వహించేందుకు అనేక ఏజెన్సీ లు కలవు. ఇక్కడ ఏజెన్సీలు వారు స్నేహ పూరిత సంభాషణలు. వీరితో వ్యవహరిస్తూ వుంటే, మీరు మీ హోం టవున్ లో ఉన్నట్లే వుంటుంది. మీరు అన్నీ మరచి పచ్చని ప్రకృతి ఒడిలో విశ్రాంతి పొందవచ్చు. 

Friday, August 8, 2014

వరలక్ష్మిదేవి వ్రత విధానము

 సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలకు తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరినప్పుడు,పార్వతీదేవికి ముక్కంటి వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పినట్లు శాస్త్రాలు వెల్లడించాయి. స్త్రీల ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగమైపోయిన 'నోములు - వ్రతాలు'లో ముందుగా 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' గురించి తెలుసుకుందాం.
సంపద వుంటే సగం సమస్యలు దూరమైనట్టే. అలాంటి సంపద లభించాలంటే సకల సంపదలకు పుట్టినిల్లు అయిన 'శ్రీ వరలక్ష్మీ దేవి' అనుగ్రహం ఉండాలి. అందుకోసం 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి పీఠంపై అమ్మవారి ప్రతిమను ... కలశాన్ని పసుపుతో అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక ఆచమనం చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కరించాలి. గణపతి ప్రార్ధన ... ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధన చేసి ... అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి.
అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించి అర్ఘ్య పాద్యాలను ఇవ్వాలి. ఆ తరువాత పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి .. శుద్ధోదక స్నానం చేయించి వస్త్రాభరణాలు .. పసుపు కుంకుమలు .. పూలు .. గంధం .. అక్షితలు సమర్పించాలి. ఆ తరువాత వరలక్ష్మీ అష్టోత్తరం చదువుకుని, ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి.
ఈ వ్రతం యొక్క కథ :
ఈ వ్రతం ఆచరించడానికి అవసరమైన ఈ కథను చెప్పుకోవాలి. పూర్వం మగధదేశంలోని ఓ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 'చారుమతి 'అనే ఇల్లాలు వుండేది. ఆమె వరలక్ష్మీ దేవి భక్తురాలు. భర్త మనసెరిగి నడచుకోవడమే కాకుండా, అత్తమామలను తల్లిదండ్రులవలే ఆదరిస్తూ వుండేది. నిరంతరం ఇంటి పనుల్లో నిమగ్నమవుతూనే, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉండేది. చారుమతి వినయ విధేయతలు ... భక్తి ప్రపత్తులకు మెచ్చిన వరలక్ష్మీ దేవి కలలో కనిపించి ఆమెపట్ల తనకి గల అనుగ్రహాన్ని తెలియజేసింది. 'శ్రావణ పౌర్ణమి'కి ముందు వచ్చు 'శుక్రవారం' తన వ్రతమును ఆచరించించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పింది. మరునాటి ఉదయం తనకి వచ్చిన కల గురించి చారుమతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లంతా కూడా అమ్మవారు చెప్పినట్టుగా చేయమని ఆమెను ప్రోత్సాహించారు. దాంతో చారుమతి తమ ఇంటి చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆ రోజున అందరూ రావాలని ఆహ్వానించింది. 'శ్రావణ శుక్రవారం'రోజున అంతా చారుమతి ఇంటికి చేరుకున్నారు.
అప్పటికే ఆమె అమ్మవారి కోసం పీఠాన్ని సిద్ధం చేసి దానిపై కలశాన్ని ఉంచింది. ఆ తరువాత షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి ... తొమ్మిది పోగుల తోరమును ధరించి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. దాంతో ఆమెతో పాటు మిగతా వారు కూడా ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు. అలా వాళ్లు ఒక్కో ప్రదక్షిణ చేస్తుండగా వాళ్ల ఇళ్లలో సిరిసంపదలు పెరిగిపోసాగాయి. మూడు ప్రదక్షిణలు పూర్తి కాగానే వాళ్లందరి ఇళ్లు ధన కనక వస్తువులతో నిండిపోయాయి. అమ్మవారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన వీళ్లంతా, ప్రతి ఏడాది చారుమతి చేసిన తరహాలోనే వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఈ వ్రతం చేసినా .. చూసినా .. కనీసం విన్నా .. సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Wednesday, August 6, 2014

సకల విఘ్నాలను హరించే మన విశాఖ వినాయగర్‌

                            సంపదలొసగే సంపత్‌ వినాయకుడు
సిద్ధిబుద్ధి వినాయకుడు, ఏకదంతుడు, లక్ష్మీగణపతిగా అందరికీ తెలిసిన వినాయకుడు సంపదలు కూడా ఇస్తానని చెప్పేందుకు వెలసిన అవతారమే సంపత్‌ వినాయగర్‌.(ఆంధ్రప్రదేశ్) లో విశాఖపట్నం జనమేగాక అనునిత్యం చుట్టుపక్కల ప్రాంతాలనుంచి అశేషంగా భక్తజనం వచ్చి స్వామివారిని కొలుచుకుంటుంటారు. అభిషేక ప్రియుడైన ఆ గజాననుడికి కోరికలు తెలియజేసు కుంటుంటారు. భక్తుల కొంగుబంగారంగా స్వామి ఇక్కడ విరాజిల్లుతున్నారు.

విశాఖ నగర నడిబొడ్డున వెలసిన శ్రీసంపత్‌ వినాయగర్‌ స్వామి భక్తుల నుండి అశేష పూజులందు కుంటున్నారు. ధూప దీప నైవేద్యాలతో, నిత్యపూజల తో ఆలయం కళకళలాడుతోంది. అభిషేక, అలంకారాలకు శ్రీసంపత్‌ వినా యగర్‌ స్వామి దేవాలయం ఏకైక ప్రత్యేకత. నగరంలో గణనాధుని ఆలయల్లో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం శ్రీసంపత్‌ వినాయగర్‌ దేవాలయం. భక్తుల పాప ప్రక్షాళనతో పాటు కొర్కేలు తీర్చే ప్రభువుగా గణనాధుడు ప్రసిద్ధికెక్కారు.
గరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ (ఆశీలుమెట్ట) సమీపంలో... 1962లో ‘మెసర్స్‌ ఎస్‌జి సంబంధన్‌ అండ్‌ కో’ ఆవరణంలో స్వర్గీయ ఎస్‌జి సంబంధన్‌, టిఎస్‌ సెల్వగణేశన్‌ టి.ఎస్‌ రాజేశ్వరన్‌ కుటుంబ సభ్యులు శ్రీ సంప త్‌ వినాయగర్‌ స్వామివారి దేవాలయాన్ని స్థాపించారు.తమ వ్యాపార కార్యాలయం ఎదుట వాస్తుదోష నివారణార్థం నిర్మించారు. తదనంతరకాలంలో మత్స్యకారులద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమేణా వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలను కథలు... కథలుగా చెప్పుకునేవారు. దేవాలయం స్థాపించిన కొత్తలో సమీప జాలర్లు ప్రతిరోజు స్వామిని అర్చించి, నమస్కరించి వారి వృత్తిని మొదలుపెట్టేవా రు. ఐదు సంవత్సరాలు తరు వాత కంచి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వహస్తాలతో ‘గణపతి యంత్రం’ స్థాపించారు. 1971లో ఇండియా, పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో విశాఖను రక్షించమని శ్రీసంపత్‌ వినాయగర్‌ స్వామిని వేడుకున్నట్టు చరిత్ర చెబుతోంది. 
సకల విఘ్నాలను హరించి తనను కొలిచేవారికి సంపదలిచ్చే వేల్పుగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు సంపత్‌ వినాయగర్‌. విశాఖపట్టణం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈస్వామి ఆలయం దేశంలోనే ఇతర వినాయక ఆలయాల కన్నా చాలా చిన్నది... ప్రతిరోజూ దాదాపు అయిదువేలమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు.ఇలా సంపత్‌ వినాయగర్‌కు ప్రాచుర్యం లభించింది. 1971లో ఇండో...పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో పాక్‌ యుద్ధనౌకలు భారత సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చినప్పుడు విశాఖను కాపాడాల్సిందిగా ప్రార్ధిస్తూ తూర్పునావికాదళం ఇన్‌చార్జి అడ్మిరల్‌ కృష్ణన్‌ సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో 1,101 కొబ్బరికాయలను స్వామివిగ్రహం ముందు కొట్టారు. ఇది జరిగిన కొద్దిరోజులకే పాకిస్తాన్‌ సబ్‌మెరైన్‌ పిఎన్‌ఎస్‌ ఘాజీ సముద్రజలాల్లో మన యుద్ధనౌకలపై దాడిచేసేందుకు వచ్చి బాంబులు అమర్చి తిరిగివెళ్తూ అవే బాంబులు పేలి సముద్రంలో మునిగిపోయింది. దీంతో విశాఖనగరానికి పెద్దప్రమాదం తప్పింది. ఇదంతా వినాయగర్‌ మహిమేనని భావించిన అడ్మిరల్‌ కృష్ణన్‌ తాను ఇక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజూ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో దర్శనానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరంలేదు. 
ప్రముఖులు సైతం సాధారణ భక్తులతోపాటు వచ్చి స్వామిని దర్శించుకోవలసిందే... అభిషేకాలు, ప్రత్యేకపూజలకు మాత్రం రుసుము వసూలుచేస్తారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినవారు ముందుగా తమ వాహనాలను సంపత్‌ వినాయగర్‌ ఆలయానికి తీసుకువచ్చి పూజలుచేయించిన తర్వాతనే వాటిని వినియో గించడం ఆనవాయితీగా మారింది. ఉగాది, వినాయకచతుర్థి, పుత్రగణపయ్య వ్రతం, సంకటహర చతుర్థి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో ఎంతో విశేషంగా మహోత్సవాలు జరుగుతాయి. సంపత్‌ వినాయగర్‌ను దర్శించుకునేందుకు ద్వారకా బస్‌స్టేషన్‌లో( విశాఖపట్టణం ఆర్ టి సి కాంప్లెంక్స్ )లో దిగి కాలినడకన చేరుకోవచ్చు.

Thursday, July 10, 2014

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడ విశేషం.త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలో అన్నవరం ఉంది .అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. 
శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.
మూలతో బ్రహ్మరూపాయ 
మధ్యతశ్చ మహేశ్వరం 
అధతో విష్ణురూపాయ 
త్ర్త్యెక్య రూపాయతేనమః

స్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.
దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.
ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది.
పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్యదేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తుంటారు.వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.