Thursday, July 10, 2014

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడ విశేషం.త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలో అన్నవరం ఉంది .అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. 
శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.
మూలతో బ్రహ్మరూపాయ 
మధ్యతశ్చ మహేశ్వరం 
అధతో విష్ణురూపాయ 
త్ర్త్యెక్య రూపాయతేనమః

స్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.
దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.
ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది.
పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్యదేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తుంటారు.వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.


No comments:

Post a Comment