Friday, January 18, 2019

పెద్ద పెద్ద (శబ్ధ) వాయిద్యాల‌తో రంజిల్లిన... రుంజు

జానపద కళలు జాతికి జీవనాడులు. విభిన్న కుల, మతాల సంగమమైన ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ జానపదుల పదముద్రలు లేని చోటు లేదు. కళారూపాల ధ్వనులు విన్పించని ప్రాంతం లేదు. ఆధునిక వ్యాపార సంస్కృతీ వలయంలో పడి, ఎన్నో జానపద కళలు చెల్లాచెదురై పోతున్నా.. కొన్ని కళలు కొన ఊపిరితో మిణుకు మిణుకుమంటూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ గ్రామీణులకు ఎన్నో తరాల నుంచీ తెలిసిన వాద్య కళారూపం 'రుంజ'.
ఇది విశిష్టమైన కళ !రుంజ
రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కళింగాంధ్రలో, కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు ఉపయోగిస్తారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చు...తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత(కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు,జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు.  అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు.  విశ్వ బ్రాహ్మణుల గోత్రాలను , వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు.  వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు , మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు.  రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.
జాతి నిర్మాణానికి మూలాలుగా ఉన్న జానపద కళా రూపాల్లో రుంజలది విశిష్ట స్థానం. రుంజ కళాకారులు దాతకులాల వారిని ఆశ్రయించి, గోత్రాలు పొగిడి వారి వంశ చరిత్రలు పాడి, జీవనోపాధి పొందుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆశ్రిత కళాకారుల్లో వీరభట్టులు, భట్రాజులు, విప్రవినోదులు, పుచ్చుకుంట్లు, రుంజలు, పొడాపోతల వారు, మాలమాష్టివారు తదితర రకాల వారున్నారు. వీరు ఆయా దాతకులాలను ఆశ్రయించి, వారి వంశ చరిత్రలు పాడి.. జీవనోపాధి పొందుతారు. బ్రాహ్మణులకు విప్రవినోది, వైశ్యులకు వీరముష్టి, గొల్లలకు పొడపోతలు లేదా మందెచ్చులు, మాల కులస్తులకు మాలమాష్టివారు కళాకారులుగా ఉన్నారు. రుంజ కళాకారులు విశ్వబ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. వీరు వ్యవసాయంతో పాటు రుంజ వృత్తిని చేపడతారు...
ఇది అన్ని వాయిద్యాల్లో పెద్దది...
చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ. దీని శబ్ధం రెండు మూడు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. రుంజను ఇత్తడితో తయారుచేస్తారు. బలమైన కట్టెపుల్లలతో వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజ వారని పిలవటం కూడా వాడుకలో ఉంది... రౌంజకాసురుణ్ణి వధించి అతని తోలుతో చేసిన రుంజ వాద్యం, రుంజ అనే వాయిద్యాన్ని రౌంజ అని కూడా అంటారు. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుండే ఈ వాయిద్యాని నిలబెట్టి వాయిస్తారు. ఇత్తడితో తయారు చేసిన ఈ రుంజ పై భాగంలో తోలును అమర్చుతారు. ఆ తోలును తాళ్లతోలాగి గట్టిగా బిగించడంతో ఇది ఒక ధ్వని వాయిద్యం అవుతుంది. ఈ వాయిద్యాన్ని గట్టి కర్రపుల్లలతో వాయింస్తారు. ఈ రుంజల నుండి వచ్చే ధ్వని యుద్ధ భేరీ నాదాలను మరిపిస్తాయి. ఈ వాయిద్యాన్ని వాయించే సమయంలో రుంజవారు తమ శక్తినంతా చేతుల్లోకి కూడదీసుకుని వాయించడంతో దిక్కులుపిక్కటిల్లేవి. రుంజా వాయించేది ముఖ్యముగా సప్తస్వరాలలో భయానక, వీరత్వ శబ్దాలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో శబ్దంలో ఒక్కో పదం ఇమిడి ఉంటుంది. అత్యద్భుత ప్రదర్శనా విన్యాసం కూడా ఇందులో భాగమే. జానపద చర్మవాద్యాలలో ‘రుంజ’ ఒక సైనిక కవాతు. మార్చింగ్ తర్జు. వీరత్వ ప్రకటన...
ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినదిగా చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల ఈ రుంజ గురించి పురాణకథ కూడా ఇలా ప్రచారంలో ఉంది. పార్వతీదేవి తన కల్యాణానికి వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరిందనీ, అప్పుడు విశ్వకర్మ రౌంజకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యంతోనే పార్వతీ కల్యాణం దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణం ద్వారా ప్రచారంలో ఉంది...
రుంజ కళాకారులు సంగీత సంబంధ సప్తతాళాల్నీ, ముప్పైరెండు రాగాలనూ ప్రదర్శిస్తారు. మూలస్తంభం, పంచముఖ బ్రహ్మావిర్భావం, పార్వతీ కల్యాణం తదితర కథల్ని చెప్పటమే కాక, మధ్యలో శ్రావ్యమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్యాన్ని రుంజపై పలికిస్తారు.
పూర్వం రుంజ వారు ఒక రాత్రి విశ్వ బ్రాహ్మణులకు కథను వివరించేవారు. ఈ సందర్భంగానే పంచ బ్రాహ్మలను గురించి, వారి వంశోత్పత్తిని చెపుతారు. పంచ బ్రహ్మలు మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ మొదలైనవారి విధులను వివరిస్తారు. మనువుకు ఇనుప పనీ, వద్దుకు కర్రపనీ, త్వ్రష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజ్ఞునికి బంగారు పనీ కేటాయించారని వివరిస్తారు. పార్వతీ కల్యాణం, దక్షయజ్ఞం, విశ్వగుణా దర్శనం, వీరభద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనం, దేవ బ్రాహ్మణ మహత్మ్యం, మూలస్తంభం, సనారి విశ్వేశ్వర సంవాదం, విశ్వ ప్రకాశ మండలం మొదలైన వాటిని కథలుగా చెపుతారు.
ఆచారిల ఇంట్లో...
రుంజ కథకుడు కథను ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి, అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవిస్తారు. ఆ తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం, బట్టలు కూడా పెడతారు. అలిఖితమైన అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రితులైన రుంజలకు, దాతలైన విశ్వబ్రాహ్మణులకు మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతోంది...
ప్రభుత్వ గుర్తింపు కరువు
ఈ కళాకారులు ఇంతకాలం ప్రభుత్వ గుర్తింపునకు, సహాయానికి నోచుకోలేదు. సామాజిక మార్పుల వల్ల ఈ కళ వీరితోనే అంతరించిపోతుంది. సినిమాలు, టీవీలు రావడంతో వీరి కళకు ఆదరణ కరువైంది. అన్ని జానపద కళా రూపాలతోపాటు రుంజ కూడా మరుగున పడుతోంది. కులవృత్తులు ఆర్థిక ఇబ్బందుల్లో పడడం వల్ల విశ్వబ్రాహ్మణులు కూడా వీరిని ఆదరించడం తగ్గింది. కళింగాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వీరు ఉన్నప్పటికీ తగిన గుర్తింపు లేదు. ఇతర దేశాలలో ఇలాంటి అరుదైన కళారూపాలకు అధునాతన సాంకేతికత జోడించి, వీటిని కనుమరుగు కాకుండా చూస్తారు. ఈ కళాకారులను ప్రోత్సహించి, ఈ కళను గ్రంథస్తం చేయాలి. అపుడే ఈ కళాజ్ఞానం సమాజంలో సజీవంగా ఉంటుంది. ఏ కళకైనా ఇదే వర్తిస్తుంది...
మంగళం
ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోక మీసా లోకమనియా
లాకులేక కోక కరుణాతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ||ఓం||
పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................||ఓం||
ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రితి లేదని నిలిచి కొలిచిన......................||ఓం||
రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతి హాసం తెలియచేస్తూ వుంది.
అంబా స్తుతి
కాంభోజి రాగం.
కంబుకాంధారీరాయాం
కాశీం హరీం రాం
బీంబోధారీ రాం
అంబుజాక్షీవేలా................................||అంబా||
ముజ్జగము లేలేటి
మోక్షదాయీ మహమ్మాయీ
సజ్జన రక్షాగాల్
గజ్జలు ఘల్మనంగ.....................||అంబా నీవిందు రావే||
అని మోక్షదాయకమైన ముజ్జగము లేలు మాతను స్మరించి తరువాత చేతులతో ఒక తాళాన్ని వాయిస్తారు. ఆ తరువాత పంచ ముఖోద్భవ బ్రహ్మలనూ, వారి వారి విధులనూ, శ్రోతలకు వివరిస్తారు. ఈ ప్రపంచాన్ని విశ్వ కర్మ రక్షిస్తున్నాడఆంటూ సకల విశ్వం యొక్క కర్తవ్వాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు.... అలాగే..................
ఇండ్లు కట్టేదెట్లో ... పెండ్లి చేయుట యెట్లో
కృషి యెట్లో శకటాద్రి క్రీడ లెట్లో
కూప ఖననం బెట్లో... ఘోర సార్జన మెట్లో
పాకఆంబు లెట్లో.... జలోపాత్ర లెట్లో
దేవతార్చన లెట్లో... దేవాలయము లెట్లో
భారకు నగలెట్లో ... పండమంచము లెట్లో
మంగళసూత్రము ... మద్దెలెట్లో
నిజము మాచేతి ... పనులనన్నిటిని లెస్స
వివరముగ లెక్క పెట్టగ య్వరి తరము
తెలివి గలిగి కృతజ్ఞలైన తెలియవలయు
శాశ్వత పదాభిలేశ... విశ్వ ప్రకాశ
అంటూ, ఈ పదంలో పంచముఖ బ్రహ్మలొనర్చే అనేకమైన పనులను వివరిస్తూ వీరు లేక పోతే జగత్తు జరగదనీ వివరిస్తూ వుంది. పద్యాలనూ, శ్లోకాలనూ, తాళ వాద్య గతుల్నీ, చిన్నతనం నుంచే వారి వారి పిల్లలకు నేర్పుతారు. అంతే గాక వారికి జీవనాధారం అదే గనుక ఈ విద్యను ఎంతో భక్తి భావంతో వారు నేర్చుకుంటారు. వారి తాళగతి ఏ విధంగా వుంటుందో ఈ క్రింది ఉదాహరణ చూస్తే మనకు అర్థమౌతుంది.
1.తక్కు ధిక్కు , ధిక్కు తకథిక్కు తకయని
అంబుజాసనుడు తాళంబు వేయ
అంటూ వేగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలలలో తాళం వేస్తారు.
2. కిటతక ధిమ్మి కిటతక ధిమ్మి
కిటతక ధింధిమ్మి యనుచు
కకకాంబరుడు మృదఆంగమును గొల్పి
కిటతక ధిమ్మి యని చేతులతో ల్ఘాతవేసి
తాళము చూపును మృధంగ ధ్వన్యను కరణ చేయును.
3. సరిగస్స సరిగమ ... పదనిస యని
వాణీ మహాదేవీ వీణమీట
అని తాళము చూపును.
4. కకుందకు ధరికిట తుతుందక ల్యని
వాణీ మహాదేవి శబ్దములు బాడ
తాండవము చేయుచుండె గురుతులు నెలదాల్చు
శ్లోకం||
చైతన్యం సర్వభూతానాం
నిర్వతిర్జ గదాత్మనాం
నాదబ్రహ్మస్తదానందం
అద్వితీయ ముపాస్మహే.
ఈ విధంగా సంగీతం యొక్క ప్రధాన్యాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. తరువాత రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగ జేస్తారు. అవే కాక నాద బ్రహ్మను ప్రణవ స్వరూపాన్నీ, అంగికా స్వాన్ని సమిష్టిగా రాగ యుక్తంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు

No comments:

Post a Comment