Tuesday, March 15, 2011

ఉప్మాక అగ్రహారం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ...


ఉప్మాక అగ్రహారం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం
స్థల పురాణం
ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్దనుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాగున్నాడు. తన వద్దకు వచ్చి మొరపెట్టుకొన్న బ్రహ్మదేవునికి విష్ణువు హయగ్రీవ మూలమంత్రం ఉపదేశించి, గరుడాచలం వద్ద "బంధుర" అనే సరస్సు దగ్గర తపస్సు చేయమని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారము ధరించి సోమకుని చంపి వేదాలను తెచ్చి బంధుర సరస్సు వద్దనున్న బ్రహ్మకు ఇచ్చాడు. బ్రహ్మ తపస్సు చేసిన క్షేత్రం ఉపమాక పేరుతో ప్రసిద్ధమౌతుందని, అక్కడ ఆచరించిన పూజ, తపస్సు, దాన, పుణ్యాదిక కర్మలు ఇతోధికంగా ఫలప్రదాలవుతాయని విష్ణువు ఆనతిచ్చాడు. కశ్యపుడు కూడా ఇక్కడ తపస్సు చేసి విష్ణువు అనుగ్రహం పొందాడు. కలియుగంలో వేంకటాద్రినుండి వేట నెపంతో తాను ఈ క్షేత్రానికి వస్తానని, శ్రీలక్ష్మీ సమేతుడై తాను ఉపమాకలో గూఢంగా నివశించువాడనని విష్ణువు చెప్పాడు. గరుత్మంతుడు కూడా ఇక్కడ తపస్సు చేసి తాను పర్వతరూపంలో స్వామివారి ఆవాసంగా ఉండేలా వరం పొందాడు. ఇలా ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి అనేక గాధలున్నాయి. క్రీ.శ. 6వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్ణభూపాలుడు స్వామివారికి ఆలయం నిర్మించాడని కూడా స్థల గాధలలో చెబుతారు.
చరిత్ర
రామానుజాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించాడని అంటారు. 17వ, 18వ శతాబ్దములలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువులు ఇక్కడి దేవునికి విలువైన కిరీటమును సమర్పించారట. బ్రౌన్ దొరగారు కూర్చిన హిందూ దేవాలయాల వివరాలలో ఉపమాక క్షేత్రం ప్రసక్తి ఉంది.
ఆలయం విశేషాలు, ఉత్సవాలు
ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. పాంచరాత్రాగమం ప్రకారం ఇక్కడ పూజాదికాలు జరుగుతాయి. సంతానార్ధులైనవారు ఇక్కడ స్వామిని దర్శించుకొంటే సత్సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ధనుర్మాస ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెలరోజులు జరుగుతాయి.
శ్రీరామ అధ్యయన ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి.
కళ్యాణ మహోత్సవం: ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.
బ్రహ్మోత్సవాలు:
ఈ ఉత్సవాలలో పుణ్యకోటి వాహనం, పొన్న వాహనం, గరుడ వాహనం, రాజాధిరాజ వాహనం, హంస వాహనం, అశ్వ వాహనం, గజ వాహనం, పెద్ద పల్లకి మరియు చిన్న పల్లకి వాహనాలపై శ్రీ వేంకటేశ్వర స్వామిని ఉభయ నాంచారులతో గ్రామ వీధులలో తిరువీధి వైభగంగా నిర్వహిస్తారు.
అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒకమారు లభించే ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ నిత్యవైకుంఠద్వార దర్శనంగా ఉంటున్నది.

ఈ క్షేత్ర మహిమలను "శ్రీ ఉపమాక క్షేత్ర మహాత్మ్యం" పేరుతో తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి చక్కని శైలితో రచించారు.
మూలాలు, వనరులు

2008, ఆగష్టు 3వ తేదీ ఆదివారం సాక్షిలో డి.వి.రమణ వ్రాసిన వ్యాసం
కుముదం భక్తి స్పెషల్ - జనవరి 2008 సంచిక - శ్రీ ఉపమాక క్షేత్ర మహాత్మ్యము - వ్యాసం రచయిత : తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి

No comments:

Post a Comment