Saturday, December 6, 2014

నాగుల చవితి

నాగుల చవితి
 సుబ్రహ్మణ్య షష్ఠి, స్కందపంచమి, కుమారషష్ఠి లానే కార్తిక చతుర్ది కూడా నాగు(పాము)లకు విశేషమైందే. శ్రావణ పంచమి నాడు నాగు(పాము)ల పుట్టలో పాలు పోసి పూజించినట్లే కార్తిక చవితినాడు పుట్టలో పాలు పోయటం, నాగులను పూజించటం చేస్తారు. ఈ నాగుల చవితినాడు పొద్దునే్ చన్నీటిస్నానం ఆచరించి ఇంట్లో నాగపడిగకు కాని నాగ ప్రతిమకుకాని పూజ చేస్తారు. ఆ తరువాత చల్లని పానకాన్ని, వడపప్పు, చలిమిడి, పాలు, కొబ్బరికాయ లాంటి వాటిని తీసుకెళ్లి పుట్టకు సమర్పిస్తారు. పుట్టకు దారం చుట్టటం కూడా కొందరు చేస్తుంటారు. పుట్టకు కొంతమంది కోడిగుడ్లు కూడా సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంతానాభివృద్ధి జరుగుతుందని హిందువల నమ్మకం.కొందరు నాగపుట్ట చుట్టూ నూకను చల్లుతూ ‘నాగరాజా నీవు నూక తీసుకొని మాకు మూకను ఇవ్వు’ అని ప్రార్థిస్తారు. మేము తెలియక చేసిన అపరాధాలను మన్నించమనీ ప్రార్థిస్తారు. ‘పడగ తొక్కితే పసివాడనుకో, నడుము తొక్కితే నీవాడనుకో, తోక తొక్కితే తొలిగిపో’ అని నాగులకు వేడుకొంటారు. నాగపూజ వలన నేత్ర, ఉదర, కర్ణ సంబంధ వ్యాధులనుకూడా దూరం అవుతాయట.

నాగులను పూజించటం వల్ల వంశాభివృద్ధి, సౌభాగ్యసిద్ధి , సర్వాభీష్టాలు కలుగుతాయి. అసలు పిల్లలు పుట్టలేదని బాధడపడేవారు సైతం నాగ పూజ చేస్తేవారికి సంతానం కలుగుతుంది. శివపార్వతులు లోక కల్యాణంకోసం పుత్రార్థులై ఉన్నసమయంలో దేవతలు ఆటకం కలిగించినందుకు పార్వతి ఎంతో కోపగించుకొంది. ఆ సమయంలో బయల్వెడలిన శివతేజస్సును దేవతల కోరికపై అగ్ని ధరించాడు. అగ్ని వల్లకాక గంగకు శివరేతస్సును ఇవ్వగా గంగ కూడా భరించలేక రెల్లువనంలో శివరేతస్సును విడిచిపెట్టింది. అక్కడ శే్వతపర్వతం ఏర్పడింది. దాన్నుంచి శరవణం ప్రభవించింది. ఆ రెల్లు వనంలోని శివతేజస్సునుంచే బాలుడు ఉదయించాడు. ఆ బాలునికి కృత్తికలు పాలివ్వగా ఆరు ముఖాలనుంచి పాలు గ్రోలాడాబాలుడు. అందుకే కార్తికేయనామధారుడయ్యాడు. ఇతనికే సుబ్రహ్మణ్యుడన్న పేరు వచ్చింది. దేవమానవులను హింసించే రాక్షసాధముడైన తారకుణ్ణి సంహరించమని దేవతలు కోరగా దేవసైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్లి యుద్ధం చేసి తారకాసుర సంహారం చేశాడు. దేవతలు మెచ్చి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేశారు. ఈ సుబ్రహ్మణుడి ప్రీత యర్థమే నాగుల చవితి పూజలు చేస్తుంటారు.
మనకు కనిపించే నాగులు ద్విజ్విహులుకావడానికి ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. కశ్యప ప్రజాపతికి కద్రువ వినతలు భార్యలు. తన సవతి అయన వినతతో కద్రువ ఓ సారి తాను చూచిన గుర్రపు తోక నల్లగా ఉందని పందెం కాసింది. వీరిద్దరిలో ఎవరి మాట తప్పు అయతే వారు రెండవ వారికి దాసిగా ఉండాలని పందెం వేసుకొన్నారు. తాను నెగ్గాలనుకొన్న కద్రువ తన సంతానాన్ని వెళ్లి ఆ గుర్రపు తోకకు చుట్టుకొని ఉండి తనను గెలిపించమని కోరింది. తన కొడుకు వలన గెలిచిన కద్రువకు వినత దాసి అయంది. ఆ దాస్యత్వం పోగొట్టడానికి ఏం చేయాలని వినత కుమారుడైన గరుత్మంతుడు నాగులను కోరగా వారు ఇంద్రుని దగ్గర ఉన్న అమృతభాండాన్ని తెచ్చి ఇవ్వమనికోరారు. వారు చెప్పిన విధంగా - దేవతలతో యుద్ధం చేసి గెలిచి అమృత భాండాన్ని తీసుకొని రాబోతుండగా ఇంద్రుడు గరుత్మంతుని పట్టుదలా, నిజాయతీల మెచ్చుకుని నీవు ఈ అమృతభాండాన్ని నాగులకిచ్చి స్నానం చేసి శుచులై వచ్చి తీసుకోమని చెప్పమని చెప్పాడు. ఇంద్రుడు చెప్పినట్లుగానే గరుత్మంతుడు నాగులకు చెప్పి దర్భపైన అమృతభాండాన్ని పెట్టాడు గరుత్మంతుడు. నాగులు శుచులై వచ్చేలోపు ఇంద్రుడు అమృతభాండాన్ని తీసుకొని వెళ్లగా ఆ దర్భలను నాగులను నాకారట. దానితో దర్భలవల్ల నాలుక రెండుగా చీలినా అమృతభాండస్పర్శఉన్న దర్భల వల్ల వారికి అమృతత్వం వచ్చిందంటారు.

No comments:

Post a Comment