Monday, November 12, 2018

శ్రీ సోమేశ్వర ఆలయం, అప్పికొండ, విశాఖ జిల్లా...


ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో అప్పికొండ సోమేశ్వర ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సమీపంలో, సాగర తీరానికి అతి చేరువలో, అప్పికొండ గ్రామంలో సోమేశ్వర ఆలయం నెలకొని ఉంది. చంద్రున్ని ధరించిన పరమేశ్వరుడు శ్వేతవర్ణంలో ఇక్కడ సోమశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. సౌరాష్ట్రలోని సముద్ర తీరాన ఉన్న సోమనాధుని ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అప్పికొండ సోమేశ్వర ఆలయo కూడా అంతే మహిమాన్వితమైనదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రాన్ని పంచలింగాల క్షేత్రం అని కూడా పిలుస్తారు. కపిల మహర్షి తపో ఫలితంగా ఈ క్షేత్రం ఏర్పడినట్లు స్థల పురాణం చెబుతోంది. సోమేశ్వర ఆలయానికి కుడి వైపున స్వరమంగళాదేవి కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. 14వ శతాబ్ధంలో సోమేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. చరిత్ర కలిగిన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి కార్తీకమాసంలో భక్తుల తాకిడితో అధికం అయింది. కార్తీకమాసం నెల రోజులు సోమేశ్వరుడ్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. చారిత్రాత్మక శివాలయంగా వెలుగొందుతున్న అప్పికొండ సోమేశ్వర ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూ వస్తుంది. అప్పికొండ తీరంలో వెలిసిని సోమేశ్వరుడు వేలాది మంది భక్తులకు ఇలవేల్పుగా పిలుచుకుంటారు. ఆలయం పరిసర గ్రామాల ప్రజల్లో ప్రతీ కుటుంబానికి ఒక్కరు సోమేశ్వరుడు నామకరణ చేసుకుంటారు. శతాబ్ధాకాలం నాటి అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయం విశాఖపట్నం నడిబొడ్డిన జివిఎంసి 55వ డివిజన్ అప్పికొండ సముద్ర తీరంలో వెలిసింది. కార్తీకమాసం, మహాశివరాత్రి రోజుల్లో సోమేశ్వర ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది.దేవాదాయయ ధర్మాదాయశాఖ ఆధీనంగా గల పురాతన సోమేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి అంతంత మాత్రమే. అయినప్పటికీ భక్తులకు మాత్రం సోమశే్వరుడు కొంగుబంగారంలా నిలుస్తున్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, అభివృద్ధి కమిటీ పాటు ట్రస్టీలు పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. ట్రస్టు బోర్డును మాత్రం ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ట్రస్టీ పర్యవేక్షణల్లో దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు ఆలయ నిర్వహణను చేపడుతారు. దేశంలోనే అతి పురాతన ఆలయంగా ప్రాచూర్యం పొందిన సోమేశ్వరుడ్ని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ధంలో కపిల తీర్ధమహిర్షి దీక్షతో అప్పికొండ సాగర తీరం అంచున వెలసిన సోమేశ్వరుడుకి భక్తుల ఆదరణ మెండుగా ఉంది. కపిలమహర్షి దీక్షతో 101 లింగాలు ఏర్పడాల్సి ఉండగా తెల్లవారే సరికి ఒకే ఒకలింగం లోటుగా ఏర్పడడం, లోటుగా ఉన్న ఒక లింగాన్ని మహార్షి అప్పుగా తీసుకోవడం కారణంగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని అప్పుకొండగా పిలిచేవారని చారిత్రక ఆధారాల బట్టి తెలుస్తుంది. రానురాను అప్పుకొండ అప్పికొండగా మారిందని పూర్వీకులు చెబుతుంటారు. అప్పికొండ సాగర తీరంలో అహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అప్పికొండ సోమేశ్వర ఆలయం క్రీస్తు పూర్వ 6,11వ శతాబ్ధాల్లో చోళులు, విజయనగర రాజులు ఆదరణతో ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ లభించిన శిలాశాసనాల బట్టి రుజువవుతుంది. సుమారు 150 ఎకరాల విస్తీర్ణం (మాన్యం) కలిగిన అప్పికొండ సోమేశ్వర ఆలయం విశాఖ ఉక్కు కర్మాగారం రాకతో నేడు 26 ఎకరాలకే పరమితమైందని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణంతో ఆప్పికొండ సోమేశ్వర ఆలయానికి ఎంతో ప్రధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. దేశ,విదేశాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి సోమేశ్వరుడుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 1992లో అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవాదాయ,్ధర్మాశాఖ అదీనంలోకి వెళ్లడంతో అప్పటి నుండి ఆలయం అభివృద్ధికి అధికారులు నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పాలవలసలో హిందూజా పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగినందున అప్పికొండ సోమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. భక్తుల కొంగు బంగారమైన అప్పికొండ సోమేశ్వర ఆలయం కమిటీ పెద్దలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీకమాసంలో ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది. ప్రధానంగా కార్తీకమాసం సోమవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని ట్రస్టు బోర్డు ప్రతినిధులతో పాటు దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతి పురాతన ఆలయంగా ఉన్న అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయానికి గత ఏడాది కాస్త మరమ్మతులు చేయించి రంగులు వేయించారు. కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులకు చేరుకునేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. కూర్మన్నపాలెం నుండి స్టీల్‌ప్లాంట్ ప్రధాన రహదారి మీదగా మెయిన్‌గేటును దాటుకుని ఆలయానికి చేరుకోవాలి. ప్రధానంగా కార్తీకమాసంలో అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో వన భోజనాలకు వచ్చే భక్తులు అధికంగా ఉంటారు. ఆలయానికి అనుకుని ఉన్న తీరంలో భక్తులు వన భోజనాలు చేసి సరదా గడుపుతారు.. 'కపిలమహర్షి' ఆరాధనకు ఆనందించి శివుడు ఆయనకి ప్రసాదించిన ఆత్మలింగమే ప్రస్తుతం ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తోందని స్థలపురాణం చెబుతోంది....

పరమేశ్వరుని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగిన కపిల మహర్షి ఈ ప్రదేశంలో నూటొక్క శివలింగాలను ప్రతిష్ఠించాడట. వాటిలో అయిదు శివలింగాలు మాత్రమే ప్రస్తుతం బయటికి కనిపిస్తూ వుంటాయి. మిగతావన్నీ కూడా కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయాయని చెబుతుంటారు. ఆ విధంగా ఇక్కడ భూమిపైనా .. కిందా కూడా శివలింగాలు ఉండటం వలన, ఇది అత్యంత శక్తిమంతమైన ... పవిత్రమైన భూమిగా భావిస్తుంటారు...
పురాణపరమైన నేపథ్యం గల ఈ ప్రదేశాన్ని గురించి తెలుసుకున్న చోళరాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆధారాలు వున్నాయి. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన పటిష్ఠమైన నిర్మాణం, చోళరాజుల అసమానమైన భక్తి విశ్వాసాలకు కొలమానంగా నిలుస్తూ వుంటుంది. సముద్ర తీరప్రాంతంలో వుండటం వలన ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుంది. భక్తులు సముద్రస్నానం చేసి ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు. గర్భాలయంలో గల 'సోమేశ్వరుడు'ని భక్తులు స్వయంగా అభిషేకించుకునే అవకాశం వుండటం ఇక్కడి ప్రత్యేకత... అలాగే ప్రతి సంవత్సరం 'మహాశివరాత్రి' సందర్భంగా ఇక్కడ ఘనంగా తీర్థం జరుగుతుంది. ఈ తీర్థంలో పాల్గొనడానికి భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. సోమేశ్వరుడిని దర్శించుకోవడం వలన అనుకున్నవి అవలీలగా నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు...


Thursday, April 5, 2018



అరకు కాఫీ.. అంతర్జాతీయ ఖ్యాతి


నాగరికత ప్రస్ధానంలో మద్యేతర పానీయాలు  కేవలం మూడిటిమటుకే అన్ని దేశాల్లో సార్వజనీనంగా ఆదరణ లభించింది. ఈ మూడిటిలో మొదటిస్ధానంలో టీనిలబడితే రెండోస్ధానంలో కాఫీ, మూడో స్ధానంలో కోకోవుంటాయి. అయితే అంతర్జాతీయంగా జరిగే వ్యాపారపరంగా చూస్తే కాఫీ’, పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత ఎగుమతి దిగుమతి చేసుకునే అతి పెద్ద ఉత్పాదన. కాఫీకి వున్న వ్యామోహం ఆదరణ చూస్తే ఆది ఒక కొత్తరకపు నాగరికతకీ, జీవనశైలికి చిహ్నంగా మారింది. కాఫీ అనేది యిపుడు మనిషికి అవసరమైన పానీయం స్ధాయి నించి ఎదిగి శక్తినీ, ఉత్పాదకతనూ పెంచే ఔషధం స్ధాయికి చేరిందనడంలో సందేహం లేదు.
కాఫీ పుట్టుక
కాఫీ ప్రపధమంగా ఆఫ్రికా ఖండంలో పుట్టి యితర దేశాలకు వ్యాప్తి చెందింది. ఇపుడు సుమారు 70 దేశాలలో కాఫీ పండుతోంది. ఇధియోపియాలోని ఖఫా ప్రాంతంలో ఓరోమె తెగకు పూర్వీకులు మొదటిసారిగా కాఫీని గుర్తించడం జరిగింది. ‘కల్డిఅనే ఇధియోపియాకు చెందిన పశువుల కాపరి కాఫీమొక్కను గుర్తించినట్టు చరిత్ర చెబుతోంది. ఇధియోపియా నించి క్రమంగా యిది అరేబియాకి వ్యాప్తి చెందింది.
భారతదేశంలో కాఫీ
16వ శతాబ్ధంలో సూఫి సన్యాసి బాబా బూదాన్‌ ఏడు కాఫీ గింజల్ని అరేబియా దేశస్తుల కళ్ళుగప్పి భారతదేశం తీసుకువచ్చాడు. వాటిని కర్ణాటకలోని చిగ్‌మగళూర్‌లో తన ఆశ్రమంలో నాటాడు. అక్కడ్నించి వ్యాప్తి చెంది భారతదేశంలో 16 రకాల కాఫీగా యిపుడు పండిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాఫీ
1898లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో బ్రిటిషు అధికారి బ్రాడీచేత కాఫీ పంట ప్రారంభమైంది. అక్కడ్నించి  పుల్లంగి, విశాఖ జిల్లా గూడెం గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920 కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి మరియు చింతపల్లి ప్రాంతాలకి విస్తరించినా అది విసృత వ్యాప్తికి నోచుకోలేదు.
అరకు కాఫీపుట్టుక
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాలలో అభివృద్ధి చేసారు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పచెప్పారు.
1956 లో గిరిజన సహకార సంస్ధ ఏర్పాడ్డక, కాఫీ బోర్డు వారు యీ సంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం వుపయోగించుకోవాలని వుద్దేశించారు. ఆ రకంగా గుర్తింపబడి, గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపంకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభమైంది. 1975 నుంచి 1985 వరకు జిసిసిలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృది
విభాగం పనిచేస్తూ సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. ఈ రకంగా సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి అరకుకాఫీఅనే పేరు స్ధిరపడింది.
1985 తర్వాత జిసిసి ఆధ్వర్యంలో అరకుకాఫీ అభివృద్ధి కోసం గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్ధ (గిరిజన కోఆపరేటివ్‌ ప్లాంటేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) స్ధాపించారు. ఈ రకంగా జిసిసిద్వారా మరియు జిసిపిడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతులకు ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పంచి ఇచ్చారు.
1997 జూలైలో జిసిపిడిసి సంస్ధ కార్యకలాపాలను సిబ్బందితో సహా ఐటిడిఎ లో విలీనంచేసి కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళికబద్ధంగానూ, MGNREGS నిధుల సహాయంతో అభివృద్ధి చేసి యీ నాటికి లక్ష ఎకరాలకు చేరి, కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగు చేస్తున్నారు.
అరకు కాఫీ ప్రత్యేకతలు
భారతదేశంలో పశ్చిమ కనుమల ప్రాంతం కాఫీ తోటల పెంపకంలో గత శతాబ్ధి కాలంలో బాగా అభివృద్ధి చెందితే, తూర్పుకనుమల ప్రాంతం కాఫీ పంటలో యింకా అభివృద్ధి చెందుతూనేవున్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖజిల్లా అరకు ప్రాంతం అత్యంత అందమైన ప్రాంతమేకాక అత్యంత అందమైన పక్షులు, రామచిలకలకు ఆలవాలంగా వుంది. అరకు ప్రాంతంలోని అరేబికారకం కాఫీ అత్యంత ప్రసిద్ధి చెందింది. పనస, సిల్వర్‌ఓక్‌, మరియు అరటి చెట్ల నీడలో పెరిగే యీ కాఫీ సేంద్రియ పద్దతుల్లో సాగుచేయబడుతున్నది. కాగా, యీ ప్రాంత అటవీ సంపదను పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడేదిగా వుంది. అరకులోయలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలలో లక్షకు పైగా గిరిజన రైతులు యీ కాఫీ పంట ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ ప్రాంత గిరిజనులు తాము సాంప్రదాయకంగా చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిస్తున్నారనేది అందరికీ ఆహ్లాదకరమైన వార్త. అరకులోయలోని కాఫీ పంట ప్రకృతికి మంచిచేసేదిగా, గిరిజనులకు కల్పతరువుగా మారిందంటే అతిశయోక్తి లేదు.
అరకు కాఫీకి అద్భుత రుచి ఎలా వచ్చింది?
అరకులోయలో పండుతున్న కాఫీ సుమారు 900 నుంచి 1100 మీటర్ల ఎత్తున పండినదైనందువల్ల యిక్కడి నేలలో మితమైన క్షారగుణం కలిగినందువల్ల యిక్కడి పండే కాఫీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి.
కాఫీ గింజల పరిమాణం లోగాని, నేలసారం వలన కలిగే గుణాల వలన, మితమైన పుల్లటి జీర జిహ్వకి తగులుతూ, స్పష్టమైన గాఢతర సువాసన, మరియు నాలుకకి తగలగానే నరాల్ని కదిలించే క్షారగుణంతో అరకు కాఫీఒక ప్రత్యేకమైన రుచి గల కాఫీగా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.
ఆకెళ్ళ రవిప్రకాష్ (raviprakash2525@gmail.com, Call-9490517777)