Friday, November 25, 2011

సుందరకాండ

సుందరకాండ

సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?
పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. 
రాముడు సుందరాతి సుందరుడు, సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది?
సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటె పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది. 

తతొ రావణనీతాయాహ్ సీతాయాహ్ శత్రుకర్షనహ్ | 
ఇయెష్హ పదమన్వెష్హ్టుం చారణాచరితె పథి ||

రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు(భూమికి దెగ్గరగా ఉండి, సర్వకాలములయందు సుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు) వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యములలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి.

హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే, ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషంలోనుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.

ఎష్హ పర్వతసంకాషొ హనూమాన్ మారుతాత్మజహ్ | 
తితీర్ష్హతి మహావెగహ్ సముద్రం మకరాలయం ||

అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఏమి ఆశ్చర్యం రా, పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు " అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు.

అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరాల వంక చూసి " రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను లంకా పట్టణం చేరుకుంటాను, అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతె అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే, అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను " అని ప్రతిజ్ఞ చేసి, తన పాదాలని పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు.

హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాలనుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహా వృక్షాలు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికయిన చెట్లు చాలా దూరం వెళ్ళాయి, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళిపోతున్న హనుమంతుడిని చూసినవారికి " ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడ, సముద్రాన్ని తాగుతున్నాడ? " అని అనుమానం వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళి బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు.

హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి " సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం " అని అనుకొని తనలో ఉన్న మైనాకపర్వతం వంక చూసి " నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లె, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు " అన్నాడు.





అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు " ఓహొ, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు " అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.

అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి " అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. ' పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు ' అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో " అన్నాడు.

అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని " నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిధ్యం ఇచ్చినట్టె, నేను పొందినట్టె, నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడా ఆగకూడదు " అని చెప్పి వెళ్ళిపోయాడు.

బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి " ఓహొ! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటకి వచ్చావు కదా " అన్నాడు.

అప్పుడు మైనాకుడు " ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను " అనుకున్నాడు.

అప్పుడు ఇంద్రుడు అన్నాడు " నాయనా మైనాక! ధైర్యంగా హనుమకి సహాయం చెయ్యడం కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిధ్యం ఇవ్వడం కోసం బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను " అని అభయమిచ్చాడు.

అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) " చూశావ తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని భయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి " అన్నారు.

అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో " నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కనుక నువ్వు నా నూట్లోకి దూరు " అనింది.

అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి " నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను " అన్నాడు.

అప్పుడా సురస " అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే " అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి " అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను " అన్నాడు.

" ఎంత బుద్ధిబలం రా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక " అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది.

అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడినిసింహిక అనే రాక్షసి సముద్రంలోనుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మోదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళి హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.

అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.

Wednesday, November 23, 2011

మణిద్వీప వర్ణన (1)


మణిద్వీప వర్ణన (1)
మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆ ప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి. 

ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది. 

సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు. 

పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.

Monday, November 21, 2011

సంక్రాంతి పుణ్యకాలము


సంక్రాంతి పుణ్యకాలము , Sankranthi Precious Time


సంక్రాంతి పుణ్యకాలము అంటే ?ప్రాచీనకాలములో శాస్త్ర అవగాహన అంతగాలేనికారణం గా సూర్యగ్రహాన్ని దేవునిగా బావించేవారు . సూర్యభవానుడు వేరు సూర్య గ్రహం వేరు .ఆది- అంతములేని ఈ విశ్వములో కోటానుకోట్ల గ్రహాలలో సూర్యగ్రహము భూమికి దగ్గరగా ఉన్న పెద్ద గ్రహాలలో ఒకటి . సూర్యభగవానుడు అదితి - కస్యపుమహామునుల బిడ్డలలో ఒకడు ... సూర్య్తతేజస్సు కలిగిన ఒక దేవతామూర్తి . సూర్యునిచుట్టూ భూమి .. భూమిచుట్టూ చంద్రుడు ఒక నిర్ధిస్ట కక్ష్యలో తిరిగే గమన్నాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని లెక్కించే కొలమానాన్ని అనేకులు అనేక రకాలుగా తయారుచేసి నిర్ణయించారు . అందులో ముఖ్యమైనవి హిందువులు పాటించేచి సూర్యగమన్నాన్ని బట్టి సూర్య మానము , చంద్రునిగమనాన్ని బట్టి చంచ్రమానము . ఈ రెండింటి ప్రకారమే ఈ సంక్రాంతి పుణ్యకాలము నిర్ణయిస్తారు ..

భూమిపై మారే వాతావరణ మార్పులు బట్టి , సూర్య కాంతి తీవ్రతను బట్టి , మన ప్రాచీన మునులు సంవత్సరకాలాన్ని సూర్యుడు గతి (మార్గము )మారే 12 రాశులుగా విభజించారు . దీనిప్రకారము సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు . ఇలా ప్రవేశించడాన్ని " సంక్రమణం " అంటారు . దానినే కొందరు సంక్రాంతి అంటారు .సూర్యుడు మకరరాశలలో ప్రవేశిస్తాడు .కావున ఈ సంకాంతిని " మకర సంక్రాంతి" అంటారు.

రాశులు : 12.

1.మేషము 2.వృషభము 3.మిధునము 4.కర్కాటకము 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము 9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము .

మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేకకు ఉత్తరదిశలొ ఉన్నట్లు కనిపించునప్పుడు --ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు -- దక్షిణాయణము అని పిలిచారు . (సంవస్తరాన్ని రెండు ఆయణములు గా విభజించారు) . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయణం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయణం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణము లో ప్రవేశించు గడియలనే పుణ్యకాలం అంటారు .మన జ్యోతిష్య్ శాస్త్రం ప్రకారము దక్షిణాయణం లో దేవతలు నిద్రించి ఉత్తరాయణమ్లో మేల్కొంటారని పురాణాలు తెలియజేయుచు్న్నాయి.ఉత్తరాయణం లో స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని , ఈ కాలలములో మరణించినవారికి వైంకుఠ ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ సూత్రాలు చెబుతున్నాయి . ఈ మకర సంక్రమణము పుష్య మాసం నుండి వస్తుంది. దక్షిణాయణము లో చనిపోయిన మన ఆత్మీయులు మనమిచ్చే తర్పణాలు మూలముగా ఉత్తరాయణ ప్రారంభం కాగానే తెరి్చియున్న ద్వారాలు గుండా వైకుంఠం చేరుకుంటారని (వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ) నమ్మకం . అందుకే పెద్దలకు పూజలు , కొత్తబట్టలు , నైవేద్యాలు పెడతారు ... పూజలు జరుపుతారు . అంతా నమ్మకమే. . . ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు .

చంద్రమానము ప్రకారము -- చంద్ర గ్రహము ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాదో ఆ నెలని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు .
తెలుగు నెలలు (తెలుగు మాసములు) :తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).


తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము


ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

మాఘమాసం మహిమ , Importance of Maagham month in hidhus


స్నానం
సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.

సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు.

వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. యజ్ఞాలకు అధిష్ఠాన దైవం ఇంద్రుడు. ఇంద్రునికి 'మఘవుడు' అనే పేరు కూడా ఉంది. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. ఇది శిశిర రుతుమాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్తృతంగా కాచేవేళ. శూన్యమాసమైన పుష్యమాసం తరవాత వచ్చే కల్యాణకారకమాసం.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ స్నానవిధులను మాఘపురాణం పేర్కొంటోంది. మాఘస్నాన మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. మృకండముని, మనస్విని మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.

మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

-- డాక్టర్‌దామెర వేంకట సూర్యారావు


మాఘమాసంఅఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు. శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

మాఘస్నాన ఫలంమాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ వరుసలోనే మాఘ పురాణంలో తొలి అధ్యాయంలో స్నానమహిమకు సంబంధించిన కథ ఉంది. రఘు వంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.

అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.

ఇది మాఘ పురాణంలో తొలి అధ్యాయంలోని కథ. ఈ పురాణ ప్రారంభంలో సూతుడు ఓ మాట చెప్పాడు. మాఘ స్నానం చెయ్యటం, తెలియని వారికి దాని విశేషం తెలియచెప్పి చేయించటం, ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చిన వారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్యఫలితాన్ని పొందటం కూడా శ్రేయస్కరాలు అంటాడు సూతుడు. దిలీపుడికి ముని సరస్సులో స్నానం చేయమని చెప్పటం ఇలాంటిదే. ఏది ఏమైనా మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల, నియమ ప్రకారం ఉదయం కాలంలో చేసే స్నానం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని నేటి కాలంలోని వైద్యులు కూడా చెప్పటం కనిపిస్తుంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


మాఘమాస మహత్యమును తెలుసుకొనుట ఎవరితరంకాదు . ఈ మాఘమాస నదీ స్నానం అత్యంత ఫలదాయకమైనది. ఈ మాఘమాస నదీ స్నానం చేయుట వల్లలభించు పుణ్యఫలము మరేయితర యజ్ఞయాగాదులు, క్రతువులు చేసినా లభించదు. ఈ మాఘమాస నదీ స్నానం చేయుట వలన మనుష్యులు అత్యంత పుణ్యాత్ములగుదురు. ఈ మాఘమాసం ఒక ప్రత్యేకమును సంతరించుకొన్నది. ఒక నదీ స్నానము వలనే మనుజులు కడు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తిని పొందెదరు. ఈ మాఘమాస స్నానము శాశ్వతపుణ్యలోక ప్రాప్తినిచ్చును. అంతియే గాని ఇతర యజ్ఞ యాగాదుల వలే తాత్కాలిక ఫలితమును ఇవ్వదు. శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలెనన్నా మాఘమాస నదీ స్నానమొక్కటే తరుణోపాయము. మరే ఇతర పుణ్య కార్యమువలన ఇది సాధ్యంకాదు.
ఫలశృతి

సూతమహర్షి శౌనకాదిమునులతో "మహర్షులారా ! వశిష్టులవారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తికావచ్చినది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీస్నానములను నియమ నిష్టలతో చేసి ఆశ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి. మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానంచేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి, శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి. మాఘమాసమును ముప్పదిరోజులు క్రమం తప్పకుండా మిక్కిలి శ్రద్దతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తసుద్దితోనూ, శ్రీమహావిష్ణువును మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియు, పుత్రపౌత్రాభివృద్దియు, వైకుంఠప్రాప్తి నొందగలరు

మాఘస్నాన పుణ్యఫలం వివరించు కథ :
పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కాని ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించటంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడకు వచ్చావు? అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవటం తప్ప మరేమీ చేయలేక పోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించ దలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గు పడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధ పడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినటం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.

కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహా విష్ణువును గురించి తపస్సు చేసి తమ కొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘ మాసస్నాన వ్రత మహాత్మ్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది.

ఇక్కడ ఇంద్రుడికి గాడిద ముఖం రావటం, పోవటం, మాఘస్నాన ఫలితం ఇలాంటివన్నీ ఆస్తిక వాదం కోసమేననుకున్నా, పరస్త్రీ వ్యామోహం పనికి రాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చి పెడుతుందని తెలియ చెప్పే హెచ్చరిక గమనార్హంగా ఉంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం
మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.

పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.

ఇలా మాఘ పురాణంలోని మూడో అధ్యాయంలో ఉన్న ఈ కథ గౌరీ కథ మహాత్మ్యంతోపాటు మాఘస్నాన పుణ్య ఫలితాలను వివరిస్తోంది. ఈ వివరణ వెనుక ఒక జన్మలో చేసిన తప్పుల పాప ఫలితాన్ని మరుసటి జన్మకు కూడా అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని కనుక పాపాలు చేయవద్దనే సున్నితమైన హెచ్చరిక ఒదిగి ఉంది.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

మాఘస్నాన పుణ్య ఫలితాలను వివిరించే మరోకథ :
పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది. తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది. సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.

ఈ కథా సందర్భంలో మాఘస్నాన పుణ్య ఫలితంతో పాటు సుమంతుడు సజ్జనురాలైన కుముదతో తగవులాడిన సంఘటన కనిపిస్తుంది. ఆ సంఘటన ఒక్కటే అతడికి పుణ్యాన్ని ప్రసాదించింది. సజ్జన సాంగత్యం వల్ల ఇలా మేలు జరుగుతుందని ఈ కథ వివరిస్తోంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు



రెడ్డి గుంట వెంగమాంబ , Reddygunta Vengamamba

జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణానికి సమీంపంలోని, రెడ్డి గుంటవద్ద వున్న సమాధి, శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు, కవయిత్రి తరిగొండ వెంగమాంబది కాదని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు నాయుడు కొట్టి పారేశారు. బుధవారం ఉదయం చిత్తూరు పట్టణం సమీపంలోని, రెడ్డి గుంట వద్ద వెంగమాంబ సమాధి, మఠంగా ప్రచారమవుతున్న స్థలాన్ని ఆయన మైసూరులోని ఆర్మియాలజీ నిపుణులు, తరిగొండ వెంగమాంబ రచనల పరిష్కార కర్త కె.జె.కృష్ణ మూర్తి, రచయిత, పరిశోధకులు సొరకాయల కృష్ణారెడ్డి తదితరులతో కలిసి సందర్శించారు. అనంతరం డి.కె.ఆదికేశవులు విలేఖరులతో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా రెడ్డిగుంట వద్ద తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అయినటు వంటి, అసలు సమాధి వున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని వెల్లడించారు.

రెడ్డిగుంటలోని సమాధి క్రీస్తుశకం 1922 ఫిబ్రవరి 15వ తేదిన శివైక్యం చెందిన రెడ్డిగుంట మఠాధిపతియైన వెంగమాంబ సమాధి అని పేర్కొన్నారు. రెడ్డిగుంట మఠాధిపతిగా వున్న వెంగమాంబ తల్లిదండ్రులు తిరుమలలోని తరిగొండ వెంగమాంబకు శిష్యులో, భక్తులో అయివుంటారని, అందుకే 1799లో జన్మించిన తమ కూతురుకు వారు వెంగమాంబ అని పేరుపెట్టివుంటారని పేర్కొన్నారు. వెంగమాంబ శిష్య సంప్రదాయమునకు చెందినదై వున్నందువల్ల కాబోలు ఆ వెంగమాంబ అన్నదానాలు, సాధు పుంగవులను ఆదరించడం వంటి కార్యక్రమాలు ఆచరించారని పేర్కొన్నారు. శిలాఫలకం మీదవున్న శివలింగం, నంది చిహ్నాలు, చివరి ‘శివ జీవైఖ్య పదవిని’చెందెను అనే వాక్యాన్ని బట్టి రెడ్డిగుంట మండలాధిపతియైన వెంగమాంబ వీరశైవ సాంప్రదాయమునకు చెందిన భక్తురాలిగా నిరూపణ అవుతుందని పేర్కొన్నారు. తరిగొండ వేంగమాంబ నందవరీక బ్రాహ్మణ వంశమున జన్మించినదని అయితే రెడ్డిగుంట వెంగమాంబ బ్రాహ్మణవంశమున జన్మించినచో సమాధిపై శివలింగము, నంది చిహ్నములు వుండవని పేర్కొన్నారు. ఈ అంశాలను బట్టి రెడ్డిగంట శైవ మఠాధిపతియగు వెంగమాంబ పరమ శివ సంప్రదాయమునకు చెందిన భక్తురాలిగా తెలుస్తున్నదని, శిలాఫలకం నందలి లిపి, అంకెలు రెడ్డిగుంట వెంగమాంబ తరిగొండ వేంగమాంబ ఒకరు కాదని నిరూపితమవుతున్నదని అన్నారు. ఈ విషయాలను వివరించిన తరువాత స్థానికులు ఈ సత్యాలను పునరాలోచించి తమ అంగీకారాన్ని సూచించారని ప్రకటనలో పేర్కొన్నారు.


తరిగొండ వెంగమాంబ , Tarigonda Vengamamba


వెంగమాంబ అనే పేరుతో ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారో తెలియదు గానీ నాకు తెలిసిన వెంగమాంబలు ... తరికొండ వెంగమాంబ , రెడ్డిగుంట వెంగమాంబ , నర్రవాడ వెంగమాంబ ఉన్నారు .

అన్నమయ్యలాగా అపారమైన భక్తితో, సంకీర్తనలతో శ్రీ వెంకటేశ్వరస్వామిని కొలిచిన భక్తురాలిగా తరిగొండ వెంగమాంబ చరిత్రకెక్కారు. స్త్రీలలో కవులుగా ప్రసిద్ధికెక్కినవారు అట్టే లేకపోయినా, లభ్యమయిన వారి కథలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. సాధారణంగా నాకు నచ్చేవి ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారు ప్రదర్శించే వ్యక్తిత్వాలు. కష్షాలు జీవితంలో ఒకభాగం. వాటిని అధిగమించి తమ జీవితాలని మలుచుకోడం మానవనైజం. పూర్వకవులలో భీమనలాగే తరిగొండ వెంగమాంబ కూడా సారస్వతాభిమానుల ఆదరణ చూరగొన్న కవయిత్రి. భక్తకవయిత్రి తరిగొండ వెంగమాంబ 279వ, తాళ్ళపాక అన్నమాచార్యుల 601వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించి పునీతులైన భక్తులెందరో! అలా వేంకటేశ్వరుని నామంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయిన భక్తశిఖామణులలో తరిగొండ వెంగమాంబ ఒకరు. వెంగమాంబ భక్తిత్పరతకు సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే కరిగిపోయాడట. అమృతధారలాంటి ఆమె గానానికి పరవశించిపోయాడట. అన్నమయ్య సంకీర్తనలకు మురిసి ఆనందంగా తల ఊపిన వేంకటేశ్వరుడు వెంగమాంబ కవితాగానానికి పరవశంతో నర్తించాడట. రమా పరిణయం, రాజయోగామృతసారం, వాశిష్ట రామాయణం వంటి ద్విపద కావ్యాలు, శ్రీకృష్ణమంజరి, నృసింహ శతకం మొదలైన శతకాలు, నృసింహ విలాసం, శివలీలా విలాసం, విష్ణుపారిజాతం, రుక్మిణీనాటకం వంటి యక్షగానాలతో పాటు, నలుగుపాటలు, జోలపాటలు, హారతిపాటలు, ఆరగింపు పాటలు, లాలిపాటలు కూడా రచించి ఆ శ్రీనివాసునికే అర్పించింది వెంగమాంబ.

తరిగొండ గ్రామంలో క్రీ.శ.1730 సంవత్సరంలో కృష్ణయ్య, మంగమ్మ దంపతులకు జన్మించింది వెంగమాంబ. పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది అన్నట్టుగా వెంగమాంబ బాల్యంనుంచే ఆ శ్రీనివాసుని మీద భక్తిప్రపత్తులతో మైమరచిపోయేది. తన ఈడు పిల్లల్లా ఆటపాటలతో కాలం గడపడం ఆమెకు నచ్చేది కాదు. అలాంటివాటికి దూరంగా ఉండేది. ఆ శ్రీనివాసుని అర్చనలు, ఆరాధనలే ఆమె ఆటపాటలయ్యాయి. సహజంగానే వెంగమాంబ ఈ పరిస్థితి ఆమె తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆ వయసులో ఉండవలసిన సహజమైన ప్రవర్తన ఆమెలో కనబడకపోవడంతో తమ కూతురికి ఏమవుతుందో అని తల్లడిల్లిపోయారు. కనీసం వివాహం చేస్తేనయినా ఆమె ధోరణి మారుతుందేమో.. అందరాడపిల్లల్లా ఉంటుందేమో అనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవు వెంటనే వివాహం జరిపించారు. ఆ విధమైన జీవితం వెంగమాంబ ఆధ్యాత్మిక జీవనానికి ఆటంకం అవుతుందనీ... ఆమెను ఆమె దారినే నడవనివ్వాలనీ అనుకున్నాడో ఏమో భగవంతుడు ఆమెను బాలవితంతువుగా చేశాడు. భర్త మరణించినా కూడా ఆమె వితంతు జీవనానికి దూరంగానే ఉండిపోయింది. ఎందుకంటే మనసా, వాచా, కర్మణా ఆ వేంకటేశ్వరుడే తన పతి అని నమ్మింది. పుట్టుకతో వచ్చిన శిరోజాలు, చిన్ననాడే వచ్చిన బొట్టు, కాటుక, పూలు వంటి చిహ్నాలను మధ్యలో వచ్చిన భర్త మరణిస్తే ఎందుకు వదిలిపెట్టాలి అని ఆనాటి సమాజాన్ని ప్రశ్నించింది. కాని ఆమె భావాలను సమాజం అంగీకరిస్తుందా? నిండు ముత్తైదువలా జీవిస్తున్న ఆమెను ఎన్నో విధాల తూలనాడింది అప్పటి సమాజం. ఆనాటి ఛాందసవాదులు ఆమెను ఎన్నో నిందలకు గురిచేసారు. ఎన్నో విధాల తూలనాడారు.. అవమానించారు. ఛాందసవాదం ఆమెలోని లోపాలను వెదకడానికే ప్రయత్నించింది తప్ప ఆమెలోని భక్తురాలిని, యోగినిని అర్థం చేసుకోలేకపోయింది. ఆమెలో పాండిత్యాన్ని గుర్తించి అంగీకరించలేకపోయింది. చివరకు ఆమె అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పరిచారు. ఈ పరిస్థితిలో తరిగొండలో ఉండలేక ఆ శ్రీనివాసుని సన్నిధే తనకు శరణ్యం అనుకొని తిరుమలకు చేరుకుంది వెంగమాంబ. అలా తిరుమల చేరిన వెంగమాంబ తన రచనలతో, కవితాగానంతో శ్రీనివాసుని అర్చిస్తుండేది. అప్పుడే శోభాయమానమైన తిరుమల మహత్మ్యాన్ని వర్ణిస్తూ ‘వేంకటాచల మహత్మ్యం’ రచించింది. ఆ వేంకటాచలవాసుని మీద ఎన్నో రమణీయమైన కీర్తనలు ఆమె నోటినుండి ఆశువుగా వెలువడేవి. సంతతధారగా వెలువడుతున్న ఆ కవితా ప్రవాహానికి అడ్డే లేకపోయింది.

భగవంతుడు తన భక్తులను అనుగ్రహించేముందు వారిని ఎన్నో పరీక్షలకు గురిచేస్తాడుట. ఆ పరీక్షలలో నెగ్గితే తప్ప వారికి తన కరుణా కటాక్షాలనందించడట. జగత్తునేలే ఆ జగన్నాధుని సన్నిధిలో నివాసం కోసం వెతుకులాటలో పడింది వెంగమాంబ. ఆలయంలో కొన్నాళ్ళు, మండపాల్లో కొన్నాళ్ళు, తిరుమల కొండకోనల్లో ఉన్న గుహల్లో కొన్నాళ్లు కాలం గడుపుతుండేది. తంబురుకోన సమీపగుహలో చాలాకాలం తపస్సు చేసింది. ఇపుడు కూడా ‘తరిగొండ గవి’ అన్న పేరుతో ఉన్న ఆ గుహను మనం చూడవచ్చు. నివాసం కోసం వెతుకులాడే ఈ పరిస్థితి నుంచి తనను కాపాడమని ప్రశాంతంగా స్వామిని సేవించుకునేలా అనుగ్రహించమని శ్రీనివాసుని వేడుకుంది. భక్తురాలు ఆర్తిగా అడిగితే భగవంతుడు కాదండా...? లేదంటాడా? తన భక్తురాలు ఇంతగా పరితపిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? అందుకే హథీరాం బాబావారి శిష్యపరంపరలో మహంతు మఠానికి అప్పటి అధిపతి ఆత్మారాందాసుకు కలలో కనబడి వెంగమాబు స్థిర నివాసం ఏర్పరచమని ఆదేశించారట. స్వామివారి ఆలయ సమీపంలో నివాసం ఏర్పరచబడింది. అక్కడే ఒక దిగుడు బావి తవ్వించి, తులసి వనాన్ని పెంచి స్వయంగా తన చేతులతో తులసిమాలలను అల్లి స్వామిని సేవిస్తూ ఉండేదట. ఇపుడు కూడా ఆ దిగుడుబావి అలాగే ఉంది. వెంగమాంబ భక్తిప్రపత్తులు, ఆమె కవితావైభవం గుర్తించిన అన్నమయ్య వంశీకులు స్వయంగా తమ నివాసంలోనే కొంత భాగాన్ని ఆమెకు అర్పించి గౌరవించారు. ఇక్కడ ఉన్నపుడే తిరుమల మాడవీధుల్లో భోగశ్రీనివాసుడు ఊరేగింపు వచ్చినపుడు ప్రతిరోజు తన ఇంటిముందు రాగానే వెండిపళ్ళెంతో హారతి హారతి ఇచ్చేదట. ఆ పరంపరగానే ఆ శ్రీనివాసుని సన్నిధిలో అన్నమయ్య వంశీకులు లాలిపాడితే వెంగమాంబ వంశీకులు హారతి పట్టడం ఆచారంగా కొనసాగుతోంది. ఆ మహాభక్తురాలు.. సాధ్వి.. సాక్షాత్తు శ్రీనివాసుని అంశంగా చెప్పబడిన వెంగమాంబ 1817 సంవత్సరంలో శ్రావణ శుద్ధ నవమినాడు సజీవంగా సమాధిలోకి ప్రవేశించారు. ఆ సమాధి, దానిమీద ఏర్పరచబడిన తులసి బృందావనం నేటికి కూడా శ్రీ వరాహస్వామి ఆలయానికి ఉత్తరంవైపున చూడవచ్చు.

చర్చనీయాంశంగా మారిన తరిగొండ వెంగమాంబ సమాధి వివాదం పాఠకులకు తెలిసింది. అయితే చిత్తూరు సమీపంలో ఉన్నదే సరైదని కొందరు, తిరుమలలో ఉన్న సమాధే నిజమైనదని మరి కొందరు వాదిస్తుండటంతో ఇటీవల టిటిడి ఓ కమిటీని వేసింది. ఈ కమిటీలో టిటిడి పాలక మండలి ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు, శ్వేత సంచాలకులు, వెంగమాంబ ప్రాజెక్టు డైరెక్టర్‌ భూమన్‌, మైసూర్‌ ఆర్కియాలజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ ఉద్యోగి డాక్టర్‌ మునిరత్నంరెడ్డి, వెంగమాంబ గ్రంథ పరిష్కర్త కెజి కృష్ణమూర్తిలను కమిటీగా నియమించింది. సమాధి విషయాన్ని నిగ్గుతేల్చేందుకు వీరు చిత్తూరు సమీపంలోని రెడ్డిగుంటకు వెళ్లారు. ప్రచారం కొనసాగుతున్న వెంగమాంబ సమాధి వద్దకు వెళ్లి పలు కోణాల్లో పరిశీలించారు. అయితే గత చరిత్ర ఆధారంగా క్షుణ్నంగా పరిశీలిస్తే అక్కడున్న సమాధి వెంగమాంబది కాదని, అది వెంగమాంబ పేరుతో ఉన్న వేరే వారిదని గుర్తించింది. తిరుమలలో ఉన్న సమాధే నిజమైన వెంగమాంబ సమాధిగా నిర్ధారించి ఆ కమిటీ నిర్ధారణకు వచ్చి ప్రకటించింది.

నిర్ధారణలో తేల్చిన అంశాలు

1. రెడ్డిగుంటలో ఉన్నది వెంగమాంబ సమాధి కాదు. అక్కడున్నది క్రీస్తుశకం 1922 ఫిబ్రవరి 15వ తేదీ బుధవారం శివైక్యంకు చెందిన రెడ్డిగుంట మఠాధిపతి అయిన వెంగమాంబ సమాధి. ఆమె చనిపోయిన చాలా కాలం తరువాత ఈ సమాధి కట్టారు.

2. రెడ్డిగుంట ముఠాధిపతిగా ఉన్న ఆ వెంగమాంబ తల్లిదండ్రులు తిరుమలలోని తరిగొండ వెంగమాంబకు శిష్యులో లేక భక్తులో అయ్యుంటారు. అందువల్లే క్రీస్తుశకం 1799లో జన్మించిన తమ కూతురుకు తరిగొండ వెంగమాంబ పేరు పెట్టారు.

3. శిష్య సంప్రదాయానికి చెందినదైనందువల్ల ఆ వెంగమాంబ అన్నదానం, సాదు బృందాల కార్యక్రమాలను అనుసరించేవారు.

4. శిలాపలకం మొదట ఉన్న శివలింగం, నంది చిహ్నాలను, శాసనం చివర 'శివ జీవైక్య పదవిని చెందెను' అను వాక్యముంది. ఇది రెడ్డిగుంట మఠాధిపతి వెంగమాంబ శైవ సాంప్రదాయానికి చెందిందిగా భక్తులు నిరూపించారు.

5. తరిగొండ వెంగమాంబ నందవరీక బ్రాహ్మణ వంశంలో జన్మించింది. రెడ్డిగుంట వెంగమాంబ బ్రాహ్మణ వంశంలో జన్మించి ఉంటే ఆమె సమాధిపై శివలింగం, నంది చిహ్నాలుండవు. రెడ్డిగుంట శైవ మఠాధిపతియైన వెంగమాంబ పరమ శైవ సంప్రదాయానికి చెందిన భక్తురాలుగా తెలుస్తోంది.

6. శిలా పలకంలో ఉన్న లిపి, అంకెలు, రెడ్డిగుంట వెంగమాంబ, తరిగొండ వెంగమాంబ వేరు వేరని నిరూపించాయి.

7. ఈ విషయాలను వివరించిన తర్వాత అక్కడి స్థానికులు ఈ సత్యాన్ని పునరాలోచించి అంగీకారం తెలిపారు.

8. కాబట్టి తరిగొండ వెంగమాంబ సమాధి తిరుమల కొండపై ఉన్నదే అసలైన సమాధియని, అది వేరే వారిధి కాదని నిర్ధారించబడింది.

పై అంశాల ఆధారంగా తరిగొండ వెంగమాంబ సమాధిని నిర్ధారించినట్లు ఆ కమిటీ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా వెంగమాంబ సమాధిపై తిరుమలలో ఉన్న సమాధే అసలైన సమాధిగా గుర్తించినట్లు టిటిడి బుధవారం సాయంత్రం ప్రకటించింది.

రచనలు

వెంకమాంబ రచనలన్నీ వేదాంతము మరియు భక్తి ప్రధానమైనవే. ఈమె రచనలలో ముఖ్యమైనవి

* పద్య కావ్యాలు
o వేంకటాచల మహాత్మ్యము
o అష్టాంగ యోగసారము
* ద్విపద కావ్యాలు
o ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము)
o రమా పరిణయము
o రాజయోగామృత సారము
o వాశిష్ఠ రామాయణము
* శతకాలు
o శ్రీకృష్ణ మంజరి.
o తరిగొండ నృసింహ శతకము
* యక్షగానాలు
o నృసింహ విలాసము
o శివలీలా విలాసము
o బాలకృష్ణ నాటకము
o విష్ణు పారిజాతము
o రుక్మిణీ నాటకము
o గోపీ నాటకము
o చెంచు నాటకము
o ముక్తి కాంతా విలాసము
o జలక్రీడా విలాసము
* తత్వ కీర్తనలు

నర్రవాడ వెంగమాంబ , Narrawada VengamAmba


వెంగమాంబ అనే పేరుతో ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారో తెలియదు గానీ నాకు తెలిసిన వెంగమాంబలు ... తరికొండ వెంగమాంబ , రెడ్డిగుంట వెంగమాంబ , నర్రవాడ వెంగమాంబ ఉన్నారు .

నర్రవాడ వెంగమాంబ : గ్రామదేవత .
ఆంధ్రప్రదేశ్ లోని వందలాది మంది గ్రామదేవతల కదల్ని పరిశీలిస్తే వారివారి పాతివ్రత్య మహిమచేతనో , దైవభక్తి చేతనో దుర్మాగ్రాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించి దేవతలైనట్లు తెలుస్తోంది . అయితే నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు , సంస్కరణకు , నైతిక విలువల పునరుద్ధరణకు , అస్పృశ్యతా నివారణకు వినిరోగించి ఇహపరశక్తులను ఆశ్చర్యపరచినది . సత్వగుణాత్మికయై స్త్రీ జాతిని చైతన్య పరచినది . సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త ఆడపడుచు ల ఆరళ్ళను దైర్యము గా ఎదుర్కోంటూ , మరో వైపు తన ఐదోతనాన్ని సైతం లెక్కచేయక భర్తను దుష్టశిక్షణకోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మానప్రాణాలను కాపాడైన మహిమాన్విత , మానవత్వము నుండే దైవత్వము ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత .

నర్రవాడ వెంగమాంబ కొలువైన చోటు :
నాడు విక్రమ సింహపురియను పేర ప్రసిద్ధి పొందిన నేటి నెల్లూరుకు హృదయస్థానము ఉదయగిరి . సుమారు వెయ్యేళ్ళు చరిత్ర కలిగిన ఈ హృదయగిరి మనసును రంజింపజేసే ప్రకృతి శోభకు ఆలవాలమైనది ... ఎత్తైన కొండలు దట్టమైన అడవులు . కొండఅంచులనుండి జాలువారే జలపాతాలు భాహ్యప్రపంచాన్ని మరపింపజేస్తుంది . శత్రు దుర్భేద్యమయిన ఉదయగిరి దుర్గాన్ని కళింగరాజైన లాంగూల గజపతి నిర్మించాడు . దీని ఎత్తు సముద్ర మట్టానికి 3079 అడుగులు .. ఘనచరిత్ర కలిగిన ఈ పట్టణమందు , చుట్టుప్రక్కల ప్రాంతాలలో సుమారు 365 దేవాలయాలుండేవి . వీటిని 1610 సం. ప్రాంతం లో శత్రురాజులు కూల్చివేసారని అక్కడివారు చెపుతారు . పార్వతి పరమేశ్వరులకు దేవగంధర్వులకు ఈ ప్రాంతం విహార స్థలమని పురాణాలు తెలియజేస్తున్నాయి . పవిత్ర స్థలము కావడం వల్ల యోగులు , మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు . దట్టమైన అడవులు , కొండలు , వుండడం చేత గజదొంగలకు స్థానము గా ఉండేది . దైవభక్తి , దివ్యశక్తి కి నెలవైన ఉదయగిరి ప్రాంతం లో పచ్చని గడ్డి కి కొదువలేదు ... ఎక్కువగా ఉండేది . అందువల్ల పశుసంపద ఇక్కడి ప్రజలకు ఎక్కువ సాదాయాన్ని తెచ్చి పెట్టేది . పదమూడవ శతాబ్దిలో యాదవవంశ యశోధీక్షితుడైన శ్రీ కాటమరాజు తన పశువుల్ని ఇక్కడ మేపుకొని పుల్లరివల్ల ఏర్పడిన తగాదాకారణము గా ఆ సమయం లో నెల్లూరును పాలించే నల్లసిద్ది రాజుతో యుద్ధం చేసి అతనిని హతమార్చి జీవకారుణ్యతను లోకానికి చాటిచెప్పడు . ఈ వీరుని వీరోచిత పోరాటాన్ని ఇప్పటికీ జానపదులు కథలుగా చెప్పుకొంటూ పశుగ్రాసం మీద పుల్లరి విధించి ప్రజల్ని హింసించే ప్రభువులకు కనువిప్పు కలిగిస్తూ వుంటారు . ఇలాంటి చారిత్రక , ఆధ్యాత్మిక నేపధ్యము కలిగిన ఉదయగిరిగి ఈశాన్యదిశలో సుమారు ఇరవై కిలోమీటర్ల దూరములో వున్న నర్రవాడ గ్రామం లో శ్రీవెంగమాంబ దేవత కొలువై ఉన్నది .

స్థల పురాణము : 
దుస్ట శిక్షణ , శిస్ట రక్షణ కోసం భగవంతుడు మనిషి రూపం లో జన్మిస్తాడని భగవద్గీత తెలియజేస్తోంది . ఇందులో భాగం గానే తనకు మారుగా సర్వేశ్వరుడు స్త్రీని సృస్టించాడనేది వాదన . జగన్మాత అనేక రూపాల్లో అవతరించి దుష్టులను హతమార్చి లోకకళ్యాణం జరిపించిదని దేవీభావతం సాక్ష్యమిస్తుంది . జగన్మాత ఆవిర్భావానికి మూలకారణాలు సామాజిక అరాచకం , ద్ర్ష్టశక్తులు విలయతాండవం చేయడం గా పేర్కొనవచ్చు . నర్రవాడ ప్రాంతం లో గజదొంగల అకృత్యాలకు అంతులేకుండా వుండేది . స్త్రీల మానప్రాణాలకు రక్షణ వుండేది కాదు . పశువుల మేపుకు , వాటి అమ్మకాలకు పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు . ఈ పరిస్థితులలో స్త్రీలు , బలహీనులైన వృద్ధులు గజదొంగల నీచకృత్యాలకు తలవంచక తప్పలేదు . మూఢనమ్మకాలతో , అర్ధం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడూంటిపోయిన దశలో తమను ఆదుకోడానికి చేవతామూర్తి జన్మించాలంటూ కనీటితో ఆకాశానికేసి ప్రార్ధించేవారు . ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మతల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని ఇక్కడి స్థలపురాణము తెలియజేస్తుంది .

నర్రవాడ వెంగమాంబ జననము :

ఇది క్రీ.శ. 16 వ శతాబ్ధిలో జరిగిన వాస్తవకథ . నర్రవాడ గ్రామానికి సమీపానగల వడ్డిపాలెం లో పచ్చన వెంగమ నాయుడు , సాయమ్మ అనే దంపతులు వుండేవారు . వీరు ఎల్లమ్మ భక్తులు . బిడ్డలకోసము పుణ్యక్షేత్రాలు తిరిగారు , వ్రతాలు , దానధర్మాలు చేశారు . వీరి నోముల పంటగా ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించినది . జగన్మాత పుట్టుకకు ప్రకృతి , యోగీశ్వరులు పరవశించిపోయారు . అనిర్వచనీయమైన ఆనందము ఆ దంపతులలోను , నర్రవాడ గ్రామములోను తాండవించింది . దివ్యశకులలతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాన్ని , గాయత్రి మంత్రాన్ని పలికింది. ఆత్మజ్ఞానం తోదినదిన ప్రవర్ధమానమవుతూ తననెచ్చెలి తుమ్మల పెదవెంగమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను , ఆర్యసూక్తులను చెపుతూ వాటిని ఆచరణలో చూపించేది . ఆమె బోధనలు విని ఆగ్రామ ప్రజలు భక్తి ప్రపత్తులతో నైతిక జీవనాన్ని సాగిస్తూ క్రమేణా చైతన్యవంతులయ్యారు . యుక్తవయస్సుకు వచ్చిన వెంగమాంబను అదే ఊరిలోని వేమూరి అంకయ్యనాయుడు రెండవ కుమారుడు గురవయ్యకిచ్చి వివాహము జరిపించారు . సాహసవంతుడు , సౌశీల్యవంతుడు అయిన గురవయ్య సాహచర్యం లో వివాహ జీవన వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్దితో ఆచరించినది వెంగమాంబ . తనకోసము కాదు ఈ బ్రతుకు ... అమాజముకోసము అన్నట్లు ఏవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయక ధైర్యముతో ముందుకు నడచి సమాజ శ్రేయస్సుకోసం పాటుపడింది .

సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది . త్రాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళిత వర్గాలకు బాసటగా నిలబడి మంచినీరు అందించింది . ప్రజలంతా సమానులని , అంటరానితనము జాతిమనుగడకు సామాజిక శపమని భోదించింది .ప్రకృతి వైపరీత్యాలవల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్ళుకూడా దొరకని పరిస్థితిలో తన పూజలతో వర్షం కురిపించి నిమ్నవర్గాలను ఆదుకొంది . తన ఐదవతనాన్ని సైతం లెక్కచేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది . గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యముగా వెనకనుండి వేసిన బళ్ళెం పోటుతో నేలకొరిగాడు . లోకపాననియైన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగళి గా తనువుచాలించి పేరంటాలుగా వెలసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకొంది . దళితులు స్వయం గా తయారుచేసి ఇచ్చిన నేతచీరను కట్టుకొని భర్తకంటే ముందుగా దహనం కావడనికి ఊరిపెద్దల అనుమతి పొంది కొన్ని నిముషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణచేసి యోగాగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది .

తల్లిని కోల్పోయిన బిడ్డలవలే కన్నిరు మున్నీరుగా రోదిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా " నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను . అందుకు గుర్తుగా నా మంగళ సూత్రాలు , పమిటచెంగు , మెట్టెలు , పసుపు కుంకుమలు చెక్కుచెదరకుండా వుంటాయని " చెప్పింది . ఆ తల్లి చెప్పినవిధంగా ఆ వస్తువులన్నీచూసిన ప్రజలు భక్తి పారవశ్యం తో " శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై " అంటూ జయజయధ్వానాలు చేసి గుడికట్టించి నేటికీ లవేల్పుగా కులదైవముగా పూజిస్తున్నారు . ఈ దేవతకు 1940 సంవత్సరములో ఆలయం నిర్మించారు . అమ్మవారు భర్త గురవయ్యతో కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైన పెదవెంగమ్మ దంపతుల విగ్రహాలను ప్రతిష్టించారు . కుడివైపు అందుడైన వెంగమాంబ బావ ముసలయ్య విగ్రహం పూజలందుకొంటుంది .

ప్రతిసంవత్సరము జ్యేష్టమాసం లో పౌర్ణము వెళ్ళేక వచ్చే మొదటి ఆదివారము నుండి గురువారము వరకూ గల ఐదురోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు . ఆదివారము " నిలుపు " , సోమ మంగళ వారములలో "గ్రామోత్సవం " , బుధవారము " పసుపు కుంకుమ ఉత్సవం " , గురువారము " పొంగళ్ళు - బండ్లు తిరుగుట , ఎడ్లచే బండ్లు లాగుట పోటీలు , వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి . ఈ తిరునాళ్ళకు వేలాది భక్తులు వస్తూఉంటారు . టన్నుకకొద్ది ఎండుకొబ్బరి అగ్నిగుండలో వేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది . ఈ ఐదురోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంస భక్షణ చేయరు . ఈ ఆలయము నర్రవాడ గ్ర్రామము నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం లో ఉన్నది .

మూలము : డా. పిన్ని చక్రపాణి గారి వ్యాసము .
 Dr.Seshagirirao